MLC Kavitha : ధర్నా చేయడానికి ఒక అర్థం ఉంది. రాస్తారోకో చేస్తున్నారంటే ఇబ్బంది ఏమి లేదు. కానీ రైల్ రోకో అంటే సాధారణ విషయం కాదు. తాజాగా తెలంగాణ ఉద్యమం లో రైల్ రోకో కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత పిలుపు నివ్వడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా కేవలం జాగృతి క్యాడర్ మాత్రమే వస్తోంది. గులాబీ శ్రేణులు మాత్రం రావడం లేదు. పార్టీలో ప్రకంపనలు సృష్టించిన నాటి నుంచి ఆమె ఒంటరి పోరాటమే చేస్తోంది. కేవలం జాగృతి శ్రేణులు మాత్రమే తరలి వస్తున్నారు.
అమెరికా నుంచి వచ్చిన నాటి నుంచి కవిత బీసీ సంఘాలకు మాత్రమే ఆహ్వానాలు పంపుతున్నారు. తాను రాజకీయంగా ఎదగడానికి బీసీ ఎజెండా ఎంచుకున్నారు. అందుకే బీసీ సంఘాలను కదిలించారు. అందుకనే జులై 17 న రైల్ రోకో కార్యక్రమం చేయాలనీ పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల వైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలోనే కవిత మెదక్ లో బీసీ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ సమావేశంలోనే ఆమె ఉద్యమ కార్యాచరణ కు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ప్రకటించకుండా ఎన్నికలకు వెళితే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటామని కవిత హెచ్చరించారు.
కవిత రైల్ రోకో పిలుపునివ్వడం గులాబీ శ్రేణులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. గులాబీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. దీనితోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ కవిత నేరుగా ప్రజల్లోకి వెళ్లి సీఎం ను లక్ష్యంగా విమర్శిస్తోంది. కవిత గతంలో ఏ కార్యక్రమం చేపట్టినా బిఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చేవారు. కానీ కవిత లేఖ బహిర్గతం అయిన నాటి నుంచి గులాబీ నేతలు ఆమె కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు చేపట్టిన రైల్ రోకో కార్యక్రమంకు ఎవరెవరు వస్తారో వేచి చూడాల్సిందే.