Gas Subsidy News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దీపం పథకంలో మొదటి విడుదల గ్యాస్ సబ్సిడీ డబ్బులు వెంటనే బ్యాంకు ఖాతాలో పడ్డాయని కానీ రెండవ విడతలో మాత్రం గ్యాస్ సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడలేదని చాలామంది చెప్తున్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు లోకల్ 18 తో మాట్లాడుతూ రెండవ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు మీ ఖాతాలో పడకపోతే వెంటనే మీరు మీ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయాలని అలాగే ఆధార్ కార్డును రేషన్ కార్డు సంబంధిత గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు వెళ్లి లింకు చేసుకోవాలని లోకల్ 18 తో గ్యాస్ వినియోగదారులైన అర్హులందరికి విజ్ఞప్తి చేశారు. దాదాపు 2.4 లక్షల మందికి ఇప్పటివరకు జిల్లాలో రెండవ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడలేదని తెలిసింది.
ఇప్పటివరకు దీపం పథకం కింద రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసి నెల రోజులు అవుతున్నా కూడా ఇంకా అకౌంట్లో సబ్సిడీ డబ్బులు జమ కాకపోవడం పట్ల రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దీపం పథకం కింద అర్హులైన గ్యాస్ వినియోగదారులందరికీ ఒక ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయబడ్డాయి. కానీ మొదటి విడతలో డబ్బులు పొందిన కొంతమంది రెండవ విడతలో గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు రాలేదని ఫిర్యాదు చేయడం జరిగింది.
వీళ్ళందరూ కూడా గ్యాస్ సబ్సిడీ డబ్బులు మొదటి విడతలో త్వరగా ఎకౌంట్లో పడ్డాయని కానీ ఈ రెండవ విడతలో మాత్రం బ్యాంక్ అకౌంట్లో ఇప్పటివరకు డబ్బులు రాలేదని చెప్తున్నారు. ఈ క్రమంలో అధికారులు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రెండవ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయడంలో కొంచెం ఆలస్యం జరిగిందని కానీ త్వరలోనే ఆ డబ్బులు అర్హులైన వినియోగదారుల ఖాతాలలో జమ చేస్తామని తెలిపారు. అలాగే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని వాళ్లకు కూడా ఈ సబ్సిడీ డబ్బులు రావు. ఒకవేళ పట్టణంలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇంటి స్థలం కలిగి ఉన్న లేదా నెలకు 100 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడుతున్న వాళ్లకి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.