Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో జూన్ 12వ తేదీన కుప్పకూలిన సంగతి అందరికీ తెలిసిందే. విమానం డీజే మెడికల్ కాలేజీ హాస్టల్ మీద ఒక్కసారిగా కుప్పకూలడంతో చుట్టుపక్కల ఉన్న జనం విమానంలో ఉన్న వారిని కాపాడడానికి పరుగులు పెట్టారు. 56 ఏళ్ల వయస్సు ఉన్న బిజినెస్ మాన్ రాజు పటేల్ కూడా అక్కడ ఉన్నాడు. విమాన ప్రమాదం జరిగిన ఐదు నిమిషాలకే రాజు మరియు అతని టీం మొత్తం సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతం మొత్తం భారీ మంటలతో అలాగే పొగతో నిండిపోయి కనిపించింది. సంఘటన స్థలంలో చిక్కుకుపోయిన జనం సాయం కోసం కేకలు వేస్తూ ఉన్నారు. కానీ అక్కడ భారీ మంటల కారణం గా వారి దగ్గరకు వెళ్లలేని పరిస్థితి.
దాదాపు 20 నిమిషాల వరకు వాళ్ల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ తర్వాత అంబులెన్సులు మరియు ఫైర్ ఇంజన్లు రావడం మొదలు పెట్టగానే రాజు మరియు అతని టీం కూడా రంగంలోకి దిగింది. ఆ సమయంలో మెడికల్ స్ట్రక్చర్స్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే బెడ్ షీట్లు మరియు చీరలలో గాయపడిన వారిని అంబులెన్స్లలో తీసుకెళ్లారు. ఈ ఘటన జరిగిన రోజు నాలుగు గంటల తర్వాత రాజు మరియు అతని టీం విమాన బాధితులకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులను సంఘటన స్థలం నుంచి సేకరించడం మొదలుపెట్టారు. వీళ్లు నాలుగు గంటల నుంచి 9 గంటల వరకు సంఘటన స్థలంలో వస్తువులను సేకరించారు.
అయితే రాజు మరియు అతని టీం కి ఈ ఘటన జరిగిన ప్రదేశంలో 70 తులాల బంగారం తో పాటు 50 వేల రూపాయల నగదు అలాగే గాజులతో పాటు ఇతర నగలు, విలువైన డాక్యుమెంట్స్, భగవద్గీత, పాస్పోర్ట్లు వంటివి దొరికాయి. ఈ వస్తువులన్నిటిని రాజు మరియు అతని టీం పోలీసులకు అప్పగించారు. గతంలో అహ్మదాబాద్ నగరంలో వరుస పేలుళ్లు జరిగిన సమయంలో కూడా రాజు అక్కడ వాలంటీర్ గా పనిచేశారు. కానీ తన జీవితంలో చూసిన దారుణమైన సంఘటన ఈ విమాన ప్రమాదం అని ఆయన చెప్పుకొచ్చారు. హోం శాఖ మంత్రి ప్రమాద స్థలంలో సేకరించిన వస్తువులను సంబంధిత బాధితుల కుటుంబాలకు అప్పగిస్తామని స్పష్టంగా తెలిపారు.