MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెట్ పల్లి/జగిత్యాల, జూన్16 (ప్రజా శంఖారావం):తెలంగాణ భవన్ కు తాళం వేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాలలోని నవదుర్గ ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో ఆమె పాల్గొన్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. మా ఎంపీ దామోదర్ రావు ఎంపీ లాడ్స్ నుంచి రూ.90 లక్షలు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ మరో రూ.10 లక్షలు ఆలయ అభివృద్ధి కొరకు ఇచ్చారనీ ఆమెఅన్నారు. వానాకాలం పంట సీజన్ మొదలైందనీ రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిందనీ దుయ్యబట్టారు.
అది కూడా 60 శాతం మంది రైతులకే లబ్ది చేకూరిందని మండిపడ్డారు. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. నీరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా లేదా రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందని పింఛన్లు పెంచలేదనీ, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదనీ ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసిందని అన్నారు.
హామీల అమలు పై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని అన్నారు. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ ని విచారణ చేసిందనీ ఈ రోజు కేటీఆర్ ని ఏసీబీ విచారిస్తోందనీ మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదనీ కేటీఆర్ విచారణకు హాజరయ్యారయ్యారని, కానీ కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గమని ఆమె తెలిపారు. మా కార్యకర్తలు,నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమని మా పార్టీ లోపాలను సవరించుకుంటామని మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని ఆమె వెల్లడించారు.