Metpally: మెట్ పల్లి, జూన్14 (ప్రజా శంఖారావం): వెల్లుల మండల కేంద్రంలో ఎక్కడ యూరియా కొరత లేదని మండల వ్యవసాయ అధికారి దీపిక అన్నారు. శనివారం ప్రాథమిక వ్యవసాయ సమాఖ్య వెల్లుల్ల బ్రాంచ్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాఖ్య పరిధిలో మొత్తం 3169 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్న 3 గ్రామాల రైతులు వరి 2340, మక్క850, పసుపు200 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారని తెలిపారు. వీటి కొరకు వానకాలం సీజన్లో 427.815 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని తెలిపారు.
ఇప్పటి వరకు సమాఖ్య గోదాములో 12.825 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వగా ఉందని పేర్కొన్నారు. గత పది రోజుల్లోనే 17.1 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు విక్రయించామని అలాగే ముందుగానే అంచనా వేసి ఈ నెల పదిన 20 మెట్రిక్ టన్నులకూ ఆర్డర్లు ఇచ్చామని అన్నారు. ఈ యూరియా లోడ్లు గత రెండు రోజుల్లో స్వీకరించబడ్డాయని తెలిపారు.
సమాఖ్య పరిధిలో యూరియా కొరత ఏమాత్రం లేదని స్పష్టంగా తెలియజేసారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం జరిగిందని, దాని ప్రభావంతో రైతులు సమాఖ్య కార్యాలయానికి హుటాహుటిన చేరుకున్నారని అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలకు భయపడకుండా, నిజానిజాలు తెలుసుకొని రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వెల్లుల సొసైటీలో ఇంకా 20మెట్రిక్ టన్నుల యూరియా, మెట్ పల్లి మండల పరిధిలో 120 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందని తెలియజేసారు.