Post Office MIS 2026: భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే వారికి ప్రస్తుతం ఎన్నో పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రభుత్వ పొదుపు పథకాలు వంటి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే వారు ఎక్కువగా పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ను ఎంచుకుంటున్నారు. అలాంటి పథకాలలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందినది పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS). ఒకేసారి పెట్టుబడి పెట్టి ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం మంచి ఎంపికగా నిలుస్తోంది.
పోస్టాఫీస్ MIS స్కీమ్లో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
ఈ పథకంలో భారతీయ పౌరులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్ పిల్లల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కూడా ఖాతా తెరవడానికి అవకాశం ఉంది. కనీసం రూ.1,000తో ఈ స్కీమ్లో చేరవచ్చు. వ్యక్తిగత (సింగిల్) ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్లో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే వీలుంది.
ఈ స్కీమ్లో ఒకేసారి లంప్సమ్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఖాతా మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీ ప్రతి నెలా పెట్టుబడిదారుడి బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాలో జమ అవుతుంది. దీంతో ప్రతి నెలా స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఐదేళ్ల గడువు పూర్తయ్యాక అసలు పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.
రూ.5 లక్షలు, రూ.9 లక్షలు పెట్టుబడిపై ఎంత నెలవారీ ఆదాయం వస్తుంది?
ఈ పథకంలో మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు పెట్టుబడిని కొనసాగించడం మంచిది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ముందుగానే డబ్బులు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత కానీ డబ్బులు ఉపసంహరించుకోలేరు. ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య ఖాతాను మూసివేస్తే డిపాజిట్ మొత్తంలో 2 శాతం కోత విధిస్తారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య మూసివేస్తే 1 శాతం తగ్గింపు ఉంటుంది.
ఉదాహరణకు, మీరు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే ప్రస్తుతం అమల్లో ఉన్న 7.40 శాతం వడ్డీ ప్రకారం ప్రతి నెలా సుమారు రూ.3,083 వడ్డీ లభిస్తుంది. ఏడాదికి ఇది దాదాపు రూ.36,996 అవుతుంది. ఐదేళ్ల కాలంలో మొత్తం వడ్డీ సుమారు రూ.1,84,980 వరకు చేరుతుంది.
అదే రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా సుమారు రూ.5,550 వడ్డీ పొందవచ్చు. సంవత్సరానికి దాదాపు రూ.66,600 ఆదాయం వస్తుంది. ఐదేళ్లలో మొత్తం వడ్డీ సుమారు రూ.3.33 లక్షలు అవుతుంది.
రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు మరియు భద్రమైన పెట్టుబడిని కోరుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. పెట్టుబడిపై భద్రతతో పాటు నిరంతర నెలవారీ ఆదాయం లభించడం ఈ పథకం ప్రత్యేకత.
















