Ration Card: తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల ఆకలి తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సన్నబియ్యం పథకం మన దేశ చరిత్రలో ఒక నిలువెత్తు ఘట్టంగా మిగిలిపోతుందని తెలిపారు. శనివారం రోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో జరిగిన పౌరసరఫరాల శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ తో పాటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మరియు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇక తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి సన్న బియ్యం పంపిణీలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నాణ్యమైన బియ్యం అందేలాగా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మొత్తం 653 రేషన్ షాపులు ఉన్నాయి. అయితే నగరవవ్యాప్తంగా ఈ రేషన్ షాపుల ద్వారా సుమారు 14,500 మెట్రిక్ టన్నుల బియ్యం అర్హులైన కుటుంబాలకు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు రోజుల్లో 30% సన్న బియ్యం పంపిణీ పూర్తి అయిందని ఇక మిగిలిన పంపిణీ కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పేదల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో సన్న బియ్యం పథకం ప్రారంభంలో కొంచెం ఆలస్యం అయిందని తెలిపారు. కానీ దీనివలన లబ్ధిదారులకు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. అలాగే మంత్రి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ బియ్యం నిర్వహించేందుకు ప్రభుత్వ స్థలాలలో గోదాములు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు.