Traffic Fines: ఇటీవల కాలంలో దేశంలో అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు చాలావరకు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వలన మరియు రాష్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్నాయి. వీటిని అడ్డుకట్ట వేసేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇకపై ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ను ఫాలో అవ్వకపోతే షాకు కొట్టేలా జరిమానాలను సవరించింది. ఈ కొత్త సవరణలు మార్చి ఒకటి నుంచి అమలు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలో రాష్ డ్రైవింగ్ ను అరికట్టడానికి మరియు రోడ్డు భద్రతను నిర్ధారించడానికి కొన్ని కీలక చర్యలు తీసుకుంది. ఎవరైనా దేశంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వాళ్ళకి విధించే జరిమానాలను ప్రభుత్వం భారీగా పెంచింది.
అయితే మార్చి ఒకటి నుంచి అమలు కానున్న ఈ ట్రాఫిక్ జరిమానాల గురించి ఇప్పటివరకు చాలామందికి తెలియదు. ఉన్నత వర్గానికి చెందిన కొంతమంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన సమయంలో తక్కువ పైనే కదా కట్టేద్దాం అనుకునే ధోరణిలో ఉంటారు. ఇటువంటి వారికి చెక్కుపెట్టేలాగా కేంద్ర ప్రభుత్వం భారీ జరిమానాలు మరియు కఠినమైన శిక్షలు పడేలా నిబంధనలను సవరించింది. మద్యం తాగి వాహనం నడుపుతున్న వాళ్ళకి కఠిన శిక్షలు తప్పవు. మొదటిసారి తప్పు చేసిన దోషులకు రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది. అదే పదే పదే ఈ నేరం చేస్తే రూ.15000 జరిమానా మరియు రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది.
గతంలో మద్యం తాగి వాహనం నడిపిన వారికి రూ.1000 నుంచి రూ.1500 మధ్య జరిమానా ఉండేది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుపడితే వాళ్లకు వెయ్యి రూపాయలు జరిమానా ఉంటుంది. గతంలో ఇది వంద రూపాయలు ఉండేది. ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెంచినట్లు తెలుస్తుంది. అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. సీట్ బెల్ట్ లేకుండా కారుల ప్రయాణం చేస్తున్న వాళ్లకి ₹1000 జరిమానా ఉంది. మొబైల్ ఫోన్ వాడటం వలన ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫోన్లో మాట్లాడుతూ పరధ్యానంలో డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం జరిమానా రూ.500 నుంచి రూ.5000కు పెంచింది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5000 జరిమానా కట్టాలి.