Weather: వాతావరణ శాఖ హెచ్చరిక..
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండాకాలంలో ఒకవైపు భానుడి ప్రతాపం మితిమీరిపోతుంటే మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడి వాతావరణం చల్లబడే దిశగా ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తుంది. భగ..భగ.. మండే భానుడి ప్రతాపానికి అల్లాడుతున్న పక్షులకు, వాతావరణ ప్రియులకు వర్షం పడుతుందనే కబురు తీపిగా అనిపించిన, వరి, మామిడి పంట సాగు చేస్తున్న రైతులకు కాస్త ఇబ్బందికర పరిస్థితులని చెప్పవచ్చు. చాలాచోట్ల వరి పంట కోత కోసే దశలో ఉండడంతో వాతావరణంలో వచ్చిన ఈ మార్పులు రైతులకు నష్టాన్ని చేకూరుస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ జిల్లాలో వర్షపాతం..
గడిచిన 15 రోజుల క్రితమే వాతావరణ శాఖ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. జిల్లాలో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలతోపాటు రైతులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంగళ, బుధవారాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు వర్షం కురుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.