CM Revanth Reddy: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశాల నుండి మధ్యాహ్నం ఢిల్లీ టూర్ కు బయలుదేరారు. పార్టీ అధిష్టానం నుండి పిలుపు రావడంతో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్రమంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు ఆయనతోపాటు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం పార్టీ పెద్దలతో సమావేశంలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. డీ లిమిటేషన్ పై పార్టీ పెద్దలతో చర్చించడంతో పాటు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన పథకాల హామీల అమలు తీరుపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.
చెన్నైలో జరిగిన సమావేశం తో పాటు డీ లిమిటేషన్ పై కేంద్రం తీసుకునే నిర్ణయంతోపాటుగా హైదరాబాదులో వచ్చేనెల మొదటి వారంలో డీ లిమిటేషన్ పై సమావేశం ఏర్పాటు చేయడంపై పార్టీ పెద్దలతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పై స్టాలిన్ తో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన సమావేశం గురించి అక్కడ చర్చించనున్నారు. సీఎం ఢిల్లీ టూర్ నుండి తిరిగి రాగానే రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరణ కూడా ఉంటుందని పార్టీ వర్గాలు తెలపడంతో మంత్రివర్గ విస్తరణ పై ఆశలు పెట్టుకున్న వారిలో మళ్లీ ఆశలు చిగురించినట్లుగా కనబడుతుంది. వచ్చేనెల ఏప్రిల్ లో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూరు ఖరారు కావడంతో ఆలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావిస్తున్నారు.