Kaleswaram: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో ఒకవైపు బోర్లు ఎత్తిపోతుండగా.. మరోవైపు బావుల్లో నీరు అడుగంటి పోతుంది. దీంతో సాగు కష్టాల్లో, ఆర్థిక నష్టాల్లో రైతులు కూరుకుపోతున్నారు. పెద్దపల్లి జిల్లాపై కుండగా ఉన్న కాలేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చుక్క నీరు లేకపోవడంతో బోర్లు బావులు అడుగంటి పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దీంతో రైతులు తిరిగి బోర్లు వేసుకోవడం, బావులలో పూడిక తీయడం లాంటి పనులను చేపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. తలాపున పారుతున్న గోదారి నీ సేను సెలుక ఎడారి అని స్థానిక కవి రచయిత మల్ల వజ్జల సదాశివుడు మూడు దశాబ్దాల క్రితం తెలంగాణ సాగునీటి కష్టాలను ఏకరువు పెట్టగా పదేళ్ల తర్వాత తిరిగి అదే పరిస్థితిలు నెలకొనడంతో కాంగ్రెస్ పాలన వచ్చింది. కష్టాలను వెంటబెట్టుకొని వచ్చిందనే విధంగా పాలన సాగుతూ ఉండడంతో రైతుల్లో అసహనం వ్యక్తం అవుతున్నది.
పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం మండలాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. 2023 ఫిబ్రవరి నెలలో భూగర్భ జలాలు 5.47 మీటర్లు లోతులో ఉండగా, 2024 ఫిబ్రవరి మాసంలో 5.09 మీటర్ల లోతులో, 2025 ఫిబ్రవరి మాసంలో 5.44 మీటర్ల లోతులోకి పడిపోయాయి.
బిఆర్ఎస్ పార్టీపై కక్షతో కాలేశ్వరంను పక్కన పెట్టి, తెలంగాణ రైతంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా ముంచుతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ఎస్ పాలనలో మోటర్లతో పని లేకుండానే కాలువల్లో సాగునీరు పారిందని, కాలేశ్వరం గేట్లు ఎత్తడంతో బోర్లన్ని ఎత్తిపోయి బోర్లలో చుక్క నీరు రావడంలేదని, మూడేళ్ల దాకా ఇక సాగు అంతేనా..? అలాగైతే తాము ఎలా బ్రతుకుతామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.