IPL 2025: ఐపీఎల్లో ఎక్కువ డబ్బులకు అమ్ముడుపోయిన ప్లేయర్లు ఈ సీజన్లో సరిగా రాణించడం లేదు. దీంతో ఆయా ప్రాంఛైజీలు తలలు పట్టుకుంటున్నాయి. బోలెడన్నీ డబ్బులు పోసి కొనుక్కున్న ప్లేయర్లు కనీసం అన్ క్యాప్డ్ ప్లేయర్లలా ఆడలేకపోతున్నారు.
రిషబ్ పంత్ ఘోర వైఫల్యం..
రిషబ్ పంత్ ఈ సీజన్ లో ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్. రూ. 27 కోట్లు పెట్టి మరీ లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క హాప్ సెంచరీ చేశాడు. మిగతా అన్ని మ్యాచుల్లో కేవలం 1, 2 ఇలా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. దీనికి కారణం కెప్టెన్సీ ఒత్తిడి అని కొంతమంది అంటున్నారు. మరి కొంత మంది క్రికెట్ ఎక్స్ ఫర్ట్స్ మెగా వేలంలో భారీ ధర పలకడం కూడా రిషబ్ పంత్ పై ఒత్తిడి చూపిస్తున్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు. ఎక్కువ ధర పలకడం వల్ల ప్రతి మ్యాచు సరిగా ఆడాలని ప్లేయర్లపై ఉంటుంది. దీంతో రిషబ్ పంత్ ఫెయిల్ అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
వెంకటేశ్ అయ్యర్ అదే రీతిలో..
వెంకటేశ్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 23 కోట్లు పెట్టి మరీ ఐపీఎల్ మెగా వేలంలో కొనుగోలు చేసింది. అయితే గత సీజన్ లో ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక రోల్ పోషించిన వెంకటేశ్ అయ్యర్ ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచుల్లో తేలిపోయాడు. కేవలం సన్ రైజర్స్ మ్యాచులో 50కి పైగా పరుగులు చేశాడు. మిగతా ఏడు మ్యాచుల్లో కూడా ఏ మాత్రం రాణించలేకపోయాడు. ఇది కాస్త టీంపై ప్రభావం చూపిస్తోంది. కోల్ కతా ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడి 3 మ్యాచులు మాత్రమే గెలిచింది. బౌలింగ్ విభాగం బాగానే ఉన్నా.. బ్యాటింగ్ లో మాత్రం విఫలమవుతోంది.
చాహాల్ మాయ పనిచేయడం లేదు..
యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లు పెట్టి మరీ వేలంలో కొనుక్కుంది. కోల్ కతాతో జరిగిన మ్యాచులో 4 వికెట్ల ప్రదర్శన తప్పితే ఆడిన ఎనిమిది మ్యాచుల్లో భారీగా పరుగులు ఇచ్చేశాడు. దీంతో పంజాబ్ టీం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడింది. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే భారీ ధర పలికిన ఆటగాళ్లలో కాస్త రాణిస్తున్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో హాప్ సెంచరీలతో చెలరేగిన శ్రేయస్ ఆ తర్వాత మ్యాచుల్లో భారీగా పరుగులు చేయలేకపోయాడు. కానీ పంజాబ్ టీంను తన కెప్టెన్సీతో ముందుండి నడిపిస్తున్నాడు.
స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వని క్లాసెన్
హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కేవలం ఒక్కసారి మాత్రమే 70 స్కోరు చేశాడు. కావ్య మారన్ పెట్టుకున్న నమ్మకానికి సరైన న్యాయం చేయలేకపోతున్నాడు. క్లాసెన్ ను రూ. 23 కోట్లకు కావ్య మారన్ రిటైన్ చేసుకుంది. ఇటు నితీశ్ కుమార్ రెడ్డి కూడా రిటైన్ చేసుకున్న ఆటగాడు. నితీశ్ కు రూ. 6 కోట్లు ఇచ్చి మరీ రిటైన్ చేసుకోగా.. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఒక్క హాప్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో జట్టుకు భారంగా మారాడు. ఇలా ప్రతి జట్టులో ఎక్కువ డబ్బులకు అమ్ముడుపోయిన ప్లేయర్లు రాణించలేకపోవడంతో ఆయా ప్రాంచైజీలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాయి.