ARREST: ఛలో సెక్రటేరియట్ వెళ్లకుండా ముందస్తు అరెస్టులు
కామారెడ్డి, ఏప్రిల్ 17 (ప్రజా శంఖారావం):తాత్కాలిక అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తె.వి.వి దక్షిణ ప్రాంగణ తాత్కాలిక అధ్యాపకులు 17 న తలపెట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి పోలీసులు గురువారం ఉదయం ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా తాత్కాలిక అధ్యాపకులు మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్లను సెక్రటేరియట్ సాక్షిగా అడగడానికి వెళ్లిన మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు. అధ్యాపకుల అరెస్టును నిరసిస్తూ దక్షిణ ప్రాంగణంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ర్యాలీని తీసి అధ్యాపకులను అరెస్టు చేయడం సరికాదని అన్నారు.
గత ప్రభుత్వాలు చేయలేని పనిని మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలోని తాత్కాలిక అధ్యాపకులకు 50 వేలతో కూడిన 12 నెలల వేతనం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం తమ పట్ల చూపిన తీవ్రమైన వివక్షగా వారు అభివర్ణించారు. ఇది చాలదన్నట్టు జీవో 21 ను తీసుకువచ్చి గత కొన్ని దశాబ్దాల కాలంగా వివిధ విభాగాలలో అరకొర జీతాలతో పనిచేస్తున్న తమకు కనీసం తమ సర్వీసును పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలను చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు.
ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని తమను, తమనే నమ్ముకున్న కుటుంబాలను రోడ్డు పాలు చేయకుండా సరైన నిర్ణయాన్ని తీసుకొని తమకు తక్షణమే న్యాయం చేయాలని వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పత్రికల ముఖంగా కోరడం జరుగుతుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులను నిరసిస్తూ మద్దతు తెలిపిన భారతీయ మజ్దూర్ సంఘ కార్మిక విభాగం స్టేట్ ప్రెసిడెంట్ సందుగారి రవీందర్ రెడ్డి. కామారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ముందస్తు అరెస్టులు చేసిన అధ్యాపకులలో డా. సునీల్ కుమార్, శ్రీకాంత్ గౌడ్, విజయ్ కుమార్ ఉండగా, భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో డా. ఇంద్రకరణ్ రెడ్డి, డా. కనకయ్య, డా. శ్రీను కేతవత్, పోతన, బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో డా. ఆఫ్రిన్ బేగం ఉన్నారు.