Delhi Capitals: ఐపీఎల్ లో థ్రిల్లింగ్ మ్యాచ్ లకు కొదవ లేదు. ప్రస్తుతం 18వ ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఇప్పటివరకు కొన్ని హై స్కోరింగ్ గేమ్ లు జరిగాయి. రెండు రోజుల నుంచి మ్యాచులు మళ్లీ రసవత్తరంగా మారాయి. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో 111 రన్స్ ను కాపాడుకుని పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని సాధించింది. యుజ్వేంద్ర చాహాల్ స్పిన్ మాయాజాలంతో కోల్ కతా నైట్ రైడర్స్ 16 పరుగుల తేడాతో ఓడిపోక తప్పలేదు. అత్యంత తక్కువ రన్స్ ను నిలుపుకుని గెలిచిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు బ్రేక్ చేసింది.
ఆద్యంతం ఉత్కంఠ..
ఢిల్లీ క్యాపిటల్స్,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచు ఆద్యంతం ఉత్కంఠగా సాగి చివరకు టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 188 పరుగులు చేసి ఇన్సింగ్స్ ముగించింది. 189 పరుగులతో ఛేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదట్లో బ్యాటింగ్ లో సిక్సర్లు, ఫోర్లతో హడలెత్తించారు. సంజు శాంసన్ కు పక్కటెముకలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ కాగా.. ఢిల్లీ కాస్త కుదురుకుంది. కానీ నితీశ్ రాణా వచ్చీ రాగానే బ్యాట్ ఝళిపించాడు. హాప్ సెంచరీతో అదరగొట్టాడు. యశస్వి జైశ్వాల్ కూడా హాప్ సెంచరీ చేశాడు. కానీ వీరిద్దరూ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ చివరి ఓవర్లలో తడబడింది. సీనియర్ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తన సీనియార్టీని ఉపయోగించి ఆరు బాల్స్ కు ఆరింటిని యార్కర్లు వేసి చివరి ఓవర్ ను టైగా చేశాడు. కేవలం చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. 8 పరుగులే ఇవ్వడంతో టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ కు దారి తీయగా అందులో ఢిల్లీ అలవోకగా నెగ్గింది.
సూపర్ ఓవర్లలో ఢిల్లీనే కింగ్..
సూపర్ ఓవరలో ఢిల్లీ క్యాపిటల్స్ తన సత్తా చాటింది. సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ను 11 పరుగులకే కట్టడి చేసి నాలుగు బంతుల్లోనే ఛేజ్ చేసేసి పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలోకి వచ్చేసింది. ఇప్పటి వరకు ఢిల్లీ ఆడిన అన్ని సీజన్లలో ఒక్కసారి కూడా ఇలా పాయింట్స్ టేబుల్స్ లో పైన కనిపించలేదు. కాగా ఈ సారి హేమంగ్ బదానీ కోచ్ గా టీంను సరికొత్త బాటలో నడిపిస్తున్నాడు. అయితే మొత్తం 18 సీజన్లలో కేవలం 15 సూపర్ ఓవర్ మ్యాచులు జరగ్గా.. అందులో ఢిల్లీ క్యాపిటల్స్ అయిదు సూపర్ ఓవర్ మ్యాచులు ఆడి నాలుగు మ్యాచుల్లో నెగ్గింది. మొదటిసారి సూపర్ ఓవర్ 2009 లో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచులో కోల్ కతా నెగ్గింది. యూసుప్ పఠాన్ మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అందుకున్నాడు.
చివరి సారి 2021లో సూపర్ ఓవర్ లో మ్యాచ్
గత నాలుగేళ్లుగా సూపర్ ఓవర్ మ్యాచులు జరగలేదు.. నాలుగేళ్ల కిందట ఢిల్లీ, ఎస్ఆర్ హెచ్ మధ్య మ్యాచ్ టైగా కాగా.. సూపర్ ఓవర్ లో ఢిల్లీ నెగ్గింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ సిక్సు కొట్టి గెలిపించాడు. మొత్తం మీద ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులకు ఈ మ్యాచ్ పూనకాలు తెప్పించింది.