Fridge Water: చాలామంది వేసవికాలం రాగానే ఫ్రిజ్లో పెట్టిన చల్లటి నీటిని తాగుతూ ఉంటారు. అయితే ఫ్రిజ్లో పెట్టిన చల్లని నీళ్లు తాగడం తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా కూడా అది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెప్తున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లని నీళ్లు తాగడం వలన జీర్ణక్రియ, గొంతు సమస్యలు, నరాలపై ప్రభావం, పంటి ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం వంటి సమస్యలు ఉన్నాయి. పోషకాహార నిపుణుడు మన్ప్రీత్ కల్రా చెప్పిన దాని ప్రకారం గడ్డకట్టిన చల్లటి నీరు తాగడం శరీరానికి చాలా హానికరం.
అధికంగా చల్లని నీళ్లు తాగడం వలన అది జీర్ణ క్రియను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కడుపునొప్పి కూడా రావచ్చు. అలాగే గొంతులోని రక్తనాళాలు దెబ్బతిని ఆ తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీయొచ్చు. చల్లని నీరు అధికంగా తాగడం వలన అది నరాలపై ప్రభావం చూపించి తలనొప్పికి కూడా దారితీస్తుంది. ముఖ్యంగా మైగ్రేన్ తో బాధపడుతున్న వారిలో మరియు తేలికపాటి జలుబు ఉన్న వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు ఫ్రిజ్లో పెట్టినా చల్లని నీళ్లు తాగడం వలన గొంతు సమస్యలు కూడా రావచ్చు.
భోజనం చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ తో చల్లని నీటిని తాగితే గొంతులో స్లేష్మం పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా మీకు జలుబు, జ్వరం, అలర్జీలు వంటి సమస్యలు రావచ్చు. అలాగే చల్లని ఆహారాలను కూడా అధికంగా తీసుకుంటే హృదయ స్పందన మందగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది రక్త ప్రసరణకు ఆటంకం కూడా కలిగిస్తుంది. అధికంగా చల్లటి నీటిని త్రాగడం పంటి ఎనామిల్ను దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో పంటిలో సున్నితత్వం పెరిగి తినే ముందు లేదా తాగే సమయంలో అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.