Assembly: మెట్ పల్లి, మార్చి 24 (ప్రజా శంఖారావం): రాష్ట్ర శాసనసభలో కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా తాను మాట్లాడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవ్వుకుంటున్నారని, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తాను శాసనసలో తన నియోజకవర్గంలోని స్కూలు, హాస్పిటల్స్ గురించి మాట్లాడితే మిగతా శాసనసభ్యులు ప్రతిసారి ఇదే సమస్యపై మాట్లాడతావని హేళన చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మెట్పల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, ఉర్దూ మీడియం పాఠశాలలో నిధులు లేక పనులు నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెట్పల్లి, కోరుట్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందని ప్రతిసారి అసెంబ్లీలో వీటిపై మాట్లాడుతూ నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.
మెట్పల్లి, కోరుట్ల పట్టణాలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు 80% పూర్తయిన మిగతా పనులను పూర్తి చేయాలని ఆయన స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా మెట్పల్లి, కోరుట్ల పట్టణ కేంద్రాల్లో జర్నలిస్టులకు గత ప్రభుత్వం హాయంలో ఇల్లు నిర్మించిన నేటికీ వాటిని లబ్ధిదారులకు అందచేయకపోవడం విడ్డూరమని చెప్పారు. స్థానిక జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా సంబంధిత శాఖ మంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉర్దూ మీడియం, జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని త్వరితగతిన ఖాళీలను భర్తి చేయాలని ఎమ్మెల్యే కొరారు. తనను చూసి ఎంత నవ్వినా, ఎంత హేళన చేసిన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం పదే.. పదే.. ప్రస్తావిస్తూ మాట్లాడుతానని, సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు వాటిపై చర్చలు వదలబోమని కోరుట్ల ఎమ్మెల్యే స్పష్టం చేశారు.