TEAM INDIA: టీం ఇండియాకు నెక్స్ట్ టెస్ట్ కెప్టెన్ ఎవరంటే?
రోహిత్ శర్మ టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో త్వరలో ఇంగ్లాండ్ తో జరగబోయే అయిదు టెస్ట్ మ్యాచుల సిరీస్ లో ఎవరికీ కెప్టెన్సీ అప్పగిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లాండ్ తో జూన్ లో స్టార్ట్ అయ్యే టెస్ట్ సిరీస్ తో నెక్ట్స్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి గెలిస్తేనే మరో రెండేళ్లలో నిర్వహించే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
కెప్టెన్సీ ఎవరికిస్తే బాగుంటుంది..
టీం ఇండియా టెస్ట్ రథసారథిగా ఎవరుంటే బాగుంటుందనే చర్చ సాగుతోంది. ఇందులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యువ క్రికెటర్ శుభమన్ గిల్.. ఇప్పటి వరకు గిల్ కేవలం అయిదు టీ 20 మ్యాచులకు కెప్టెన్ గా మాత్రమే చేశారు. టెస్ట్, వన్డేలకు టీం ఇండియా తరఫున కెప్టెన్ గా చేయలేదు. కానీ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున కెప్టెన్ గా రాణిస్తున్నాడు. గుజరాత్ టీం తరఫున ఎక్కువ రన్స్ చేస్తూనే రథసారథిగా ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం గిల్ వయసు 25. యువకుడికి కెప్టెన్సీ అప్పగిస్తే సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంటుందని క్రికెట్ ఎక్స్ ఫర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గిల్ చాలా ప్రతిభావంతుడని టెస్టుల్లో చాలా సహనంతో బ్యాటింగ్ చేస్తాడని అంటున్నారు.
గిల్ కు టీం రథసారథి బాధ్యతలు ఇస్తే 5 సంత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ కు ఎలాంటి డోకా ఉండదని అనుకుంటున్నారు.
రేసులో ఉన్న బుమ్రా..
జస్ప్రీత్ బుమ్రా కూడా టీం ఇండియా క్రికెట్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మొదటి టెస్ట్ మ్యాచులో రోహిత్ శర్మ ఆడలేదు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ ఇండియాలోనే ఉండిపోయాడు. ఆ సమయంలో బుమ్రా కెప్టెన్సీలో టీం ఇండియా మొదటి టెస్ట్ లో విజయం సాధించింది. బుమ్రా కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే చివరి టెస్టుకు వచ్చే సరికి బౌలింగ్ భారం మొత్తం బుమ్రాపై పడటంతో వెన్ను గాయం తిరగబెట్టింది. దీంతో బుమ్రా చివరి టెస్టు సెకండ్ ఇన్సింగ్స్ లో బౌలింగ్ వేయలేదు. ఐపీఎల్ లో మొదటి నాలుగు మ్యాచులకు అందుబాటులోకి రాలేదు. కానీ బుమ్రా కెప్టెన్సీ చాలా బాగా చేయగలడని అతడిని నియమిస్తే బాగుంటుందని చాలా మంది క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
బుమ్రాపై భారం ఎక్కువైతే ఎలా..
జస్ ప్రీత్ బుమ్రాపై భారం ఎక్కువైతే మళ్లీ గాయపడే అవకాశం ఉంది. దీంతో కెప్టెన్సీ మరొకరికి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే జస్ ప్రీత్ బుమ్రా టీం ఇండియాకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో కెప్టెన్ గా ఫస్ట్ చాయిస్ బుమ్రానే కనిపిస్తున్నాడు. కానీ బీసీసీఐ బుమ్రాను నియమిస్తుందో.. లేక యువకుడు అయినా శుభమన్ గిల్ కు చాయిస్ ఇస్తుందో త్వరలోనే తేలనుంది. మొత్తం మీద రోహిత్ రిటైర్మెంట్ తో టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు ఎవరికీ అప్పగిస్తారోనని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.